ప్ర‌పంచంలోనే అతిపెద్ద అంబేద్క‌ర్ విగ్ర‌హం

Update: 2022-04-13 11:40 GMT

తెలంగాణ మున్సిప‌ల్, ఐటి శాఖ‌ల మంత్రి కెటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో ప్ర‌స్తుతం అభివృద్ధి ఉద్యమం నడుస్తున్నదని వ్యాఖ్యానించారు. సీఎం కెసీఆర్ అంబేద్క‌ర్ చూపిన బాటలో నడుస్తూ,వారి ఆశయాల మేరకు ప్రజలందరి సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. డిసెంబ‌ర్‌లోగా ఐమ్యాక్స్ ప‌క్క‌న అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టిస్తామ‌ని ప్రకటించారు. హైదరాబాద్ లో నెలకొల్పుతున్న 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ప్రపంచం మొత్తం మీద అతి పెద్దదని ఆయన తెలిపారు. ఈ కాంస్య విగ్రహాన్ని 11ఎకరాలలో 150కోట్లతో గొప్పగా ప్రతిష్ఠిస్తున్నమని మంత్రి తెలిపారు. సచివాలయం సమీపాన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు పనులను బుధవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి కేటీఆర్ పరిశీలించారు.

ఆర్ అండ్ బీ ఈఎన్ సీ గణపతి రెడ్డిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు, ఈ ప్రాంగణాన్ని సుందరంగా,ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, పర్యాటక కేంద్రంగా మార‌నుంద‌ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అంబేద్క‌ర్ తాను రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నయని అన్నారు. దళితబంధు,రైతుబంధు పథకాలు మహత్తరమైనవి,ప్రజలందరి సహకారంతో వీటిని విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News