Full Viewదేశ వ్యాప్తంగా దుమారం రేపిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంలో కొత్త మలుపు. ఒరిజినల్ వీడియో దొరికితే తప్ప...ఇందులో వాస్తవం తేలదంటూ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తేల్చేశారు. ఓ వైపు ప్రభుత్వ పెద్దలు..సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇంత కాలంగా ఫోరెన్సిక్ కు వెళ్లింది..నిజం అని తేలితే కఠిన చర్యలు ఉంటయని ప్రకటించారు. ఇప్పుడు అసలు అనంతపురం ఎస్పీ సోషల్ మీడియాలో ఉన్నది ఎడిటింగ్, మార్ఫింగ్ చేసిన వీడియో అని..ఒరిజినల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్ కు పంపగలమన్నారు. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లు ఉంది. అనంతపురం ఎస్పీ పకీరప్ప చెప్పిన వివరాలు...ప్రభుత్వం స్పందిస్తున్న తీరు చూస్తుంటే ఈ వ్యవహారం అటకెక్కినట్లే కన్పిస్తోంది. ఎస్పీ ప్రకటనపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని, ఫేక్ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు. ఆయన బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. ఆ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ వీడియోను మార్ఫింగ్ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ఈ మేరకే దర్యాప్తు చేపట్టామని అన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఐ.టీడీపీ వాట్సాప్ గ్రూపులో మొదట వచ్చిందని తెలిపారు. ఆగస్టు 4వ తేదీ అర్ధరాత్రి 2.07కు +447443703968 నెంబర్ నుంచి పోస్ట్ చేశారు. యూకేలో రిజిస్టర్ అయిన నెంబర్తో వీడియో అప్లోడ్ అయ్యింది. ఈ వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదు. ఆ నెంబర్ ఎవరిదో కనుక్కునే పనిలో ఉన్నాం. వీడియో ఫార్వర్డ్, రీపోస్ట్ చేయడం వల్ల అది ఒరిజినల్ అని గుర్తించలేకపోతున్నామని ఎస్పీ తెలిపారు. వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ అని నిర్ధారించలేమన్నారు. ఈ వీడియోపై ఎంపీ మాధవ్ స్వయంగా తనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని మీడియా ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు.