
ఏపీ ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. పీఆర్సీ అమలు విషయంలో జాప్యం చేస్తున్న సర్కారుపై పోరుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం తమకు కనీసం పీఆర్సీ నివేదిక కూడా ఇవ్వకపోవటం ఏమిటి అంటూ గత కొంత కాలంగా ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ తరుణంలో పీఆర్సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ను తిరుపతి సరస్వతీ నగర్లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు కలిసి పీఆర్సీపై విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, పదిరోజుల్లో ప్రకటన చేస్తామని సీఎం జగన్ అన్నారు. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. అయితే ఉద్యోగ సంఘాలు సీఎం ప్రకటనపై ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.