
ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. పెట్రో రేట్లపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమి మాట్లాడారు. ఇప్పుడు ఏమి చేస్తున్నారు అని ప్రశ్నించారు. అధికారం ఉంది కదా అని రేట్ల పెంపుతో ప్రజలను ఇబ్బంది పెడతారా అంటూ మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించాయని, ఇతర రాష్ట్రాల్లోకన్నా ఏపీలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రో ధరలను ఏపీ ప్రభుత్వం ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు.
జగన్ది తుగ్లక్ పాలన కాక మరేమిటన్నారు. పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని, పెట్రోల్ ధరలను వెంటనే ప్రభుత్వం తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పెట్రో ధరలతో రైతులు అప్పులపాలవుతున్నారని, ఓ పక్క విధ్వంసం.. మరో వైపు ప్రజలపై భారం.. ఇదే జగన్ పాలన అని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు.