Full ViewFull Viewఇది ఫిక్స్. పక్కా అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇప్పటికే ఇలాంటి ముహుర్తాలు గతంలో చాలా వచ్చినా ఈ సారి మాత్రం వైసీపీ అధినేత, సీఎం జగన్ మాత్రం వైజాగ్ కు షిఫ్ట్ అవ్వటం ఖాయం అని, ఈ మేరకు జగన్ డిసైడ్ అయ్యారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జగన్ వైజాగ్ కు మకాం మార్చాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ వైజాగ్ పై ఇటీవల ఫోకస్ పెంచారు. ఏప్రిల్ లో అక్కడికి చేరే వరకూ ఈ ఫోకస్ మరింత పెరిగే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2023 ఏప్రిల్ నాటికి వైజాగ్ లోని రుషికొండపై క్యాంప్ ఆఫీసు కూడా సిద్ధం అవుతుందని అంచనా వేస్తున్నారు. అధికారులు, ఇతర సిబ్బంది షిఫ్ట్ అవటానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సమయాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు. అయితే జగన్ వైజాగ్ వచ్చి కూర్చుంటే విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసినట్లు అవుతుందా?.జగన్ నిర్ణయం వల్ల ఆయన ఆశించిన రాజకీయ ప్రయోజనం చేకూరుతుందా అన్న అంశంపై కూడా ఆ పార్టీ నేతల్లో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. జగన్ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లుకు ఎలాంటి చట్టబద్దత లేదని ఏపీ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఓ సారి రాజధానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం మూడు రాజధానులు అనటం సరికాదని..పార్లమెంట్ లో మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పు తర్వాత కూడా వైసీపీ సర్కారు తాము పరిపాలనా వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని..వైజాగ్ లోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందని మంత్రులు పలుమార్లు ప్రకటించారు. ఈ తరుణంలో జగన్ వచ్చే ఏప్రిల్ నుంచి వైజాగ్ కు షిఫ్ట్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లోగా మరోసారి ఏమైనా బిల్లులు తెచ్చే ప్రయత్నం చేస్తారా..కేంద్రంతో మాట్లాడి చట్టంలో మార్పులు చేయించుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల్లో వైసీపీ మూడు రాజధానుల నినాదంతో..టీడీపీ ఒకే రాజధాని గా అమరావతి నినాదంతో ముందుకు సాగే అవకాశం కన్పిస్తోంది. వైసీపీ ఒక్కటే మూడు రాజధానుల గురించి మాట్లాడుతుంటే టీడీపీ, బిజెపి, జనసేనలు మాత్రం అమరావతే రాజధాని నినాదంతో ఉన్నాయి. మరి అంతిమంగా ఎన్నికలలోపు ఏమి తేలుతుందో వేచిచూడాల్సిందే.