Full Viewప్రముఖ ఎయిర్ లైన్స్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణికులకు షాకిచ్చింది. ఒకటి కాదు..రెండు కాదు ఏకంగా 800 విమాన సర్వీసులను రద్దు చేయటంతో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 1,30,000 మంది ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. జీతాల పెంపు కోరుతూ పైలట్లతోపాటు విమాన సిబ్బంది సమ్మెకు దిగటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుల విమానాలతో కార్గో విమానాలు కూడా సమ్మె కారణంగా నిలిచిపోయాయి. ఈ ప్రభావం భారత్ లోనూ పడింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఫ్రాంక్ ఫర్ట్, మ్యూనిక్ వెళ్లాల్సిన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 వద్ద ఏకంగా 150 మంది నిరసన చేపట్టారు.
అయితే అధికారులు ప్రత్యామ్నాయ విమానాల్లో పంపటం లేదా మరో తేదీకి టిక్కెట్లు ఇస్తామని ప్రకటించటంతో వీరు ఆందోళన విరమించారు. ఎక్కువగా ఇందులో విద్యార్ధులు ఉన్నట్లు సమాచారం. .పైలట్ల సమ్మె ప్రభావాన్ని తగ్గించడానికి సాధ్యమైనదంతా చేస్తున్నట్లు ఎయిర్లైన్ ప్రకటించినా ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పలేదు. వేతనాల పెంపును కోరుతూ లుఫ్తాన్సా పైలట్లు అకస్మాత్తుగా భారీ సమ్మెకు దిగారు. తమ డిమాండ్లను యాజమాన్యం తిరస్కరించిన కారణంగా సమ్మె తప్ప లేదని పైలట్ల సంఘం వెల్లడించింది.