ఈ ఆలయాన్ని 1553లో మహరాజా బహదూర్ సింగ్ నిర్మించారు. చెక్కలతో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం అడవుల మధ్య ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. మహాభారతంతో ఈ ఆలయానికి ప్రత్యేక సంబంధం ఉంది. అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఈ ప్రదేశంలో కొద్ది రోజులు ఉన్నారు అని చెపుతారు. ఆ సమయంలోనే ఈ ప్రాంతంలో ఉండే రాక్షసుడు హిడింబాసురుడు వాళ్ల వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబను పంపుతాడు. అయితే రాత్రి వేళ అక్కడ కాపలాగా ఉన్న భీమున్ని చూసి హిడింబ ప్రేమలో పడుతుంది. తన అన్న వలన మీకు అపాయం పొంచి ఉందని భీమున్ని హెచ్చరిస్తుంది.
అయితే తరువాత జరిగిన యుద్ధంలో భీముడు హిడింబాసురున్ని అంతమొందిస్తాడు. తర్వాత హడింబ తన ప్రేమను భీమునికి వ్యక్తపరిచి తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది. అయితే ఇక్కడ తాము కొంతకాలమే ఉంటామని, కాబట్టి ఇక్కడ ఉన్నత కాలం మాత్రమే నీతో ఉండగలనని భీముడు షరతు విధించడంతో హిడింబ దానికి అంగీకరించి తన ప్రేమను సఫలం చేసుకుంటుంది. భీముని కారణంగానే హడింబకు ఘటోత్కచుడు జన్మిస్తాడు. మహాభారత యుద్ధంలో తండ్రి భీముడి ఆదేశం మేరకు యుద్ధానికి దిగి తన ప్రాణాలనే అర్పించిన ఘటోత్కచుడి చరిత్ర తెలిసిందే. హిడింబ, ఘటోత్కచుడు రాక్షస జాతికి చెందిన వారు అయినా ఎప్పుడూ ఎవ్వరికీ హాని తలపెట్టకుండా, ధర్మం వైపు నిలబడడంతో వారు కూడా దేవతలుగానే కొలవబడుతున్నారు.