ఉత్తరప్రదేశ్ లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రాంతం అంతా భారీ వర్షాలకు నీట మునిగింది. విమానాశ్రయం టెర్మినల్ కు వెళ్లే మార్గంతో పాటు పార్కింగ్ ఏరియా లోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరింది. దీంతో విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించి ఆరు నెలలు కూడా కాకముందే ఈ పరిస్థితి ఏర్పడటంతో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని జేవర్ వద్ద అభివృద్ధి చేసిన ఈ ఎయిర్ పోర్టు ను 2026 మార్చి 28 న ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు జూన్ 15 నుంచి స్టార్ట్ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఈ ఎయిర్ పోర్టు తొలిదశను 11200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అభివృద్ధి చేశారు. ఏటా 1 .20 కోట్ల మంది ప్రయాణించేందుకు వీలుగా దీన్ని అభివృద్ధి చేశారు. కొత్తగా అభివృద్ధి చేసిన ఈ విమానాశ్రయంలో డ్రైనేజీ సిస్టం పని చేసేది ఇలాగేనా...ఇది ఎయిర్ పోర్టా లేక సీ పోర్టా అంటూ ప్రయాణికులు విమర్శలు చేస్తున్నారు. నీట మునిగిన నోయిడా ఎయిర్ పోర్టు ఫోటోలు..వీడియో లు సోషల్ మీడియా లో ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి.