Full Viewకేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా తాను తగ్గేదేలే అంటున్నారు. ఇటీవలే అత్యంత కీలకమైన పార్లమెంటరీ బోర్డు నుంచి ఆయన్ను తప్పించారు. గత కొంత కాలంగా ప్రధాని మోడీ తీరుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నందునే పార్లమెంటరీ బోర్డు నుంచి తప్పించారనే ప్రచారం జరిగింది. అయినా సరే నితిన్ గడ్కరీ తన బాట వీడలేదు. తాజాగా ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వాజ్ పేయి, అద్వానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ వంటి నేతల వల్లే తాము ఇప్పుడు అధికారంలో ఉన్నామన్నారు. వీరితో పాటు ఎంతో మంది కార్యకర్తల కష్టం ఉందన్నారు. ఇప్పుడు బిజెపిలో అంతా మోడీ, అమిత్ షా కనుసన్నల్లోనే సాగుతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం అధికారమే కేంద్రం రాజకీయాలు సాగుతున్నాయని మరోసారి వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తారు..దేశాన్ని..సమాజాన్ని నిర్మించాలనుకునే సమాజ-ఆర్ధిక సంస్కర్తలు మాత్రం చాలా ముందు చూపుతో వచ్చే శాతాబ్దాల గురించి ఆలోచిస్తారు అని వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంకర్త దత్తోపంత్ థెంగడీ పదే పదే ఇదే విషయం చెప్పేవారన్నారు. ప్రస్తుత బిజెపి రాజకీయాలను చూసే నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.