Full Viewగౌతమ్ అదానీ మరో అడుగు ముందుకేశారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో ఏకంగా మూడవ స్థానానికి చేరుకున్నారు. ఇప్పటివరకూ ఆసియా నుంచి ఆ ప్లేస్ కు చేరుకున్న తొలి వ్యక్తి అదానీనే కావటం విశేషం. గత కొంత కాలంగా గౌతమ్ అదానీ పలు నూతన రంగాల్లోకి అడుడుపెడుతూ దేశ పారిశ్రామిక రంగంలో సంచలనాలు నమోదు చేస్తున్నారు. తాజాగా ఎన్డీటీవీలో కూడా వాటాలు దక్కించుకుని మీడియా రంగంలో కూడా కలకలం రేపారు. సాధ్యమైనంత వేగంగా ఎన్డీటీవీ యాజమాన్య బాధ్యతలు తమ చేతిలోకి వచ్చేలా అదానీ పావులు కదుపుతున్నారు. ఇది కూడా ఎంతో దూరంలో లేదని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రపంచ సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా,లు ఉన్నప్పటికీ ఎప్పుడూ మొదటి మూడు స్థానాలకు చేరుకోలేదు. 137.4 బిలియన్ల డాలర్ల మొత్తం నికర విలువతో, 60 ఏళ్ల అదానీ, సంపదలో లూయిస్ విట్టన్ ఛైర్మన్ ఆర్నాల్ట్ను అధిగమించారు. ప్రస్తుతం టెస్లా సీఈవో ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ నికర విలువ వరుసగా 251 బిలియన్ డాలర్లు, 153 బిలియన్ డాలర్లుగా ఉంది. వీరిద్దరూ మొదటి, రెండు స్థానాలను ఆక్రమించగా..అదానీ మూడవ ప్లేస్ లో ఉన్నారు. ఒక్క 2022 లోనే అదానీ సంపద 60.9 బిలియన్ డాలర్లు పెరిగింది.