Full Viewకొద్ది రోజుల క్రితమే దిగ్గజ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ దుబాయ్ లోని అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతం పామ్ జుమేరాలో 640 కోట్ల రూపాయల వ్యయంతో ఓ విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు. ఈ ప్రాంతంలోనే ప్రపంచంలోని సంపన్నులు అంతా తమ నివాస సముదాయాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు దాన్ని తలదన్నే డీల్ ఒకటి దుబాయ్ లో జరిగింది. ఇదే పామ్ జుమేరా ప్రాంతంలో ఎనిమిది బెడ్ రూమ్స్ విల్లా ఏకంగా 671.5 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. దుబాయ్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన నివాస సముదాయం కావటం విశేషం. విచిత్రం ఏమిటంటే ఈ విల్లా ఇంకా నిర్మాణంలోనే ఉంది.
ఇందులో జిమ్, సినిమా, బౌలింగ్ ప్రాంతం తదితర సౌకర్యాలు ఉంటాయి. తాజా డీల్ తో గతంలో ముఖేష్ అంబానీ తనయుడు కొనుగోలు చేసిన విల్లా రికార్డును ఇది బ్రేక్ చేసినట్లు అయింది. దుబాయ్ చరిత్రలో ఖరీదైన డీల్ గా నిలిచిన ఈ విల్లా పేరు కాసా డెల్ సోల్. కొనుగోలుదారుతో ఉన్న ఒప్పందం ప్రకారం డెవలపర్ ఈ డీల్ ఎవరితో జరిగిందో వెల్లడించలేదు. గత ఏడాది కాలంలో దుబాయ్ లో రియల్ ఎస్టేట్ ధరల్లో పెరుగుదల నమోదు అవుతోంది. ప్రీమియం విల్లాల అమ్మకాలకు ఇది బంపర్ ఇయర్ గా నిలిచిందని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి.