Full Viewటీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ కుమార్తె...ఎమ్మెల్సీ కవిత వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆమె టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని గుర్తుకు తెస్తున్నారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఎవరికైనా ఇదేంటి అన్న సందేహం రావటం సహజమే. గత కొన్ని రోజులుగా కెసీఆర్ కేబినెట్ లోని మంత్రులు...ఎమ్మెల్యేలు..పార్టీ నేతలు ఎమ్మెల్సీ కవిత ఇంటికి క్యూ కడుతున్నారు. అంతే కాదు..ఆమెకు సంఘీభావం తెలిపేందుకే వీరంతా వస్తున్నట్లు ఫోటోలు కూడా మీడియాకు విడుదల అవుతున్నాయి. ఓ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అవి రాష్ట్రంలో పెద్ద కలకలమే రేపాయి. అయితే ఆమె ఈ ఆరోపణలను ఖండించారు..కేసులు పెట్టారు. తనపై ఆరోపణలు చేయకుండా కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ కూడా తెచ్చుకున్నారు. తొలుత నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ లు భారీ సంఖ్యలో కార్యకర్తలతో వెళ్లి మరీ కవితకు సంఘీభావం తెలిపారు. ఆరోపణలు వచ్చిన సమయంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు బిజెపి శ్రేణులు ధర్నా చేయటమే వీరి సంఘీభావానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. తలసాని తర్వాత ఇక రాష్ట్ర మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు అంతా కవిత ఇంటికి క్యూకడుతూనే ఉన్నారు. ఈ వ్యవహారం చూసిన టీఆర్ఎస్ నాయకులు కూడా అవాక్కు అవుతున్నారు. ఇలాంటి చర్యలు పార్టీకి లాభం చేయకపోగా..రాజకీయంగా నష్టం చేస్తాయనే అభిప్రాయాన్ని ఓ సీనియర్ నేత వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు పంపుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
ఏదైనా విజయం సాధించినప్పుడో..రాష్ట్రానికి మేలు చేసే పని చేసినప్పుడు అభినందనలు తెలిపితే పర్వాలేదు కానీ..అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు..ఓ పార్టీ ఇంటి ముందు ధర్నా చేసిందని ఏకంగా మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు కెసీఆర్ కుమార్తెకు సంఘీభావం తెలుపుతూ తిరగటం రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం నాడు కూడా ఈ సంఘీభావ ప్రదర్శనలు కొనసాగాయి. మంత్రి కొప్పుల ఈశ్వర్ తోపాటు ఎంపీ దామోదర్ రావు..మరికొంత మంది నేతలు..కార్యకర్తలు కవిత ఇంట్లో ఆమెను కలసి సంఘీభావం తెలిపారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా భారీ ఎత్తున కార్యకర్తలతో కవిత ఇంటికి చేరుకుంటూ ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై 2003 అక్టోబర్ లో తిరుపతిలో అలిపిరి వద్ద నక్సలైట్లు బాంబు దాడి చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఈ దాడితో తనపై సానుభూతి వస్తుందని..అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. ఆ క్రమంలోనే అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలను హైదరాబాద్ తరలించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపేలా ఏర్పాట్లు చేశారు. అయినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. జిల్లాల నుంచి చంద్రబాబు కు సంఘీభావం తెలిపేందుకు జనాన్ని తరలించినట్లు..ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కోసం కొంత మంది మంత్రులు...ఎమ్మెల్యేలు ఈ సంఘీభావ యాత్రలకు శ్రీకారం చుట్టారని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.