ప్రాంతీయ పార్టీ స్టైల్ లో సీఎం నిర్ణయాలు
ప్రాంతీయ పార్టీల్లో అంతా అధినేత ఇష్ట ప్రకారమే సాగుతుంది. అది పార్టీ లో అయినా...ప్రభుత్వంలో అయినా. కానీ జాతీయ పార్టీల్లో చాలా వరకు ఆ పరిస్థితి ఉండదు. కానీ తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అచ్చం మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మోడల్ నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ని కూడా ప్రాంతీయ పార్టీ తరహాలో నడిపిస్తున్నారు అనే అభిప్రాయం ఎక్కువ మంది కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణా ప్రభుత్వం మంగళవారం నాడు పత్రికల్లో ఒక ప్రకటన ఇచ్చింది. రైతు భరోసా కింద రాష్ట్రంలో రైతులకు 9000 కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు ఈ ప్రకటన సారాంశం. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఫోటో లు మాత్రమే వేశారు. సీనియర్ మంత్రి...సీనియర్ నేత అయిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోటో కు ఈ యాడ్ లో ఎక్కడా చోటు దక్కలేదు. ఒక్క తుమ్మల నాగేశ్వర్ రావు విషయంలోనే కాదు..గతంలో కూడా తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో ఆయా శాఖ మంత్రులను పూర్తిగా విస్మరించి కేవలం సీఎం రేవంత్ రెడ్డి..డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కల ఫోటోల తోనే ప్రకటనలు ఇస్తున్నారు.