Full Viewటీఆర్ఎస్ అదినేత, తెలంగాణ సీఎం కెసీఆర్ బీహార్ పర్యటన అసలు లక్ష్యం సంగతి ఏమో కానీ ఇది ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఓ వైపు సీఎం కెసీఆర్ మీడియాతో మాట్లాడుతుండగానే బీహార్ సీఎం నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ లు మీడియా సమావేశం నుంచి వెళ్లిపోవటానికి లేచారు. సీఎం కెసీఆర్ వీరిద్దరిని పదే పదే కూర్చోవాల్సిందిగా కోరినా చాలా సేపు అలా నిలుచునే ఉన్నారు. ఓ వైపు సహచార సీఎం మీడియాతో మాట్లాడుతుండగానే..నితీష్ కుమార్ అక్కడ నుంచి లేచివెళ్లిపోవాలని చూడటంతో ఇది తెలంగాణ సీఎం కెసీఆర్ కు అవమానం అని కొంత మంది..బీహార్ పర్యటనలో ఉండి..2024కు ప్రధాని అభ్యర్ధిగా నితిష్ కుమార్ పేరును మీరు ప్రతిపాదిస్తారా అని ప్రశ్నించగా..అలా ప్రకటించటానికి తాను ఎవరినని..తాను ప్రకటిస్తే కొంత మంది విభేదించవచ్చని..అంతా కలసి కూర్చుని..మాట్లాడిన తర్వాత ఎవరి నాయకత్వంలో ముందుకు వెళ్లాలనేది నిర్ణయిస్తామని కెసీఆర్ తెలిపారు. ఇది నితీష్ కుమార్ చాలా ఇబ్బందికర పరిస్థితిని కల్పించింది. బిజెపి ముక్త్ భారత్ కోసం అన్ని పార్టీలతో పాటు కాంగ్రెస్ ను కూడా కలుపుకుంటారా..రాహుల్ గాంధీ విషయం ఏమిటని మీడియా నుంచి వరస ప్రశ్నలు రావటంతో కెసీఆర్..మీకు ఎందుకు అంత తొందర..నిర్ణయం అయిపోయిన తర్వాత చెబుతామంటూ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ అక్కడ నుంచి వెళ్లిపోవటానికి ప్రయత్నించటం..సీఎం కెసీఆర్ పదే పదే ప్లీజ్ కూర్చోండి అని కోరటం..దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియో ఆధారంగా బిజెపి కూడా అటు కెసీఆర్..ఇటు నితీష్ కుమార్ లపై రాజకీయ దాడి ప్రారంభించారు. బీహార్ కు చెందిన బిజెపి సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ సీఎం కేసీఆర్, నితీశ్ లు ప్రధాని కావాలని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. నితీశ్ ప్రధాని అభ్యర్ధిత్వాన్ని స్వయంగా కేసీఆరే ఒప్పుకోలేదన్నారు. 2024 కంటే ముందు 2023లో రాబోయే ఎన్నికల్లో వీరిద్దరూ ఓడిపోతారని సుశీల్ కుమార్ మోడీ జోస్యం చెప్పారు. 2023లో నెగ్గితే అప్పుడు ప్రధాని అభ్యర్థిత్వం సంగతి చూద్దామన్నారు. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కెసీఆర్ బీహార్ పర్యటన చూసి నాయకులు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశానికి కల్వకుంట్ల కుటుంబ తప్ప దిక్కులేదన్న చందంగా కెసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. పదే పదే తెలంగాణ మోడల్ అని చెబుతున్న కెసీఆర్ దేశమంతటా నియంతృత్వ పాలన తేవాలనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. మీడియా నుంచి ఇబ్బందికర ప్రశ్నలు రావటంతో నితీష్ కుమార్ అక్కడ నుంచి వెళ్లేందుకు లేచారని..దీన్ని కూడా బిజెపి రాజకీయం చేస్తోందని టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తప్పుపట్టారు.