Full Viewరాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కేంద్రంలోని బిజెపి ప్లాన్ ఇదేనా?. ఎవరిపై అయినా చర్యలు తీసుకోవటానికి ఓ ఫిర్యాదు..కొన్ని ఆధారాలు కావాలి. అది ఎవరి నుంచి వచ్చినా వాడాలనుకున్నప్పుడు వాడొచ్చు..వద్దనుకున్నప్పుడు పక్కన పెట్టొచ్చు. కేంద్రం అయినా..రాష్ట్రాల్లో అయినా ప్రస్తుతం ఇదే జరుగుతోంది. సరిగ్గా నెల రోజుల క్రితం ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కె ఏ పాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ముఖ్యమంత్రులకు కూడా అంత ఈజీగా దక్కని అపాయింట్ మెంట్ కె ఏ పాల్ కు మాత్రం అలవోకగా దక్కింది. అప్పుడు కూడా కె ఏ పాల్ తాను తెలంగాణ సీఎం కెసీఆర్ పిర్యాదు చేశానని..వారి సంగతి చూస్తానంటూ మీడియా ముందు వ్యాఖ్యానించారు. సీన్ అక్కడ కట్ చేస్తే మళ్ళీ కె ఏ పాల్ ఢిల్లీలో ప్రత్యక్షం అయి సీబీఐ డైరక్టర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ ను కలసి సీఎం కెసీఆర్ ఫ్యామిలీ చే్స్తున్న అవినీతిపై ఫిర్యాదు చేశానని ప్రకటించారు.
ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్తో సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం, కేటీఆర్, కవిత చేస్తున్న అవినీతిపై ఇంతవరకు ఎవరూ సరైన ఫిర్యాదు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పానన్నారు. కెసీఆర్ తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవిత లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.తెలంగాణ తో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ నేతలు కూడా లిఖితపూర్వంగా ఫిర్యాదు చేసినా కూడా ఈ క్రెడిట్ కూడా కాంగ్రెస్ నేతలకు బిజెపి ఇవ్వాలనుకోదు కాబట్టి..ఇలా కె ఏ పాల్ లాంటి వారిని ఉపయోగిస్తోందని టీఆర్ఎస్ లో కూడా చర్చ సాగుతోంది.