రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత యువతదే

Update: 2021-01-12 06:30 GMT

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. గత పందొమ్మిది నెలలు ఏపీ అంథకారంలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తికీ ఒక వ్యక్తిత్వం ఉన్నట్టుగా ప్రతి జాతికీ, దేశానికీ వ్యక్తిత్వం ఉందని దాన్ని ఆ జాతి ప్రజలు కాపాడుకోవాలని స్వామి వివేకానంద సూచించారని తెలిపారు. ఆ సూక్తి స్ఫూర్తిగానే ఎన్టీఆర్ తెలుగు జాతి వ్యక్తిత్వాన్ని చాటేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలని సూచించారు.

జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువతకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని ఆరోపించారు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేశారనీ.. యువత స్వయం ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని విమర్శించారు. వేలమంది యువతీయువకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలని.. పాలకుల దుశ్చర్యలపై అన్ని వర్గాల ప్రజలను చైతన్యపరచాలని కోరారు.

Tags:    

Similar News