వైసీపీ అధినేత నోట అసాధారణ ప్రకటనలు

Update: 2024-07-21 08:00 GMT

Full Viewఇంతలోనే మరీ అంత ఫ్రస్ట్రేషనా?. అధికారం కోల్పోయి..టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా నిండా రెండు నెలలు కూడా కాలేదు. ఏ రాజకీయ పార్టీకి అయినా అధికారం నుంచి దూరం కావటం షాక్ వంటిదే. అందులో ముప్పై సంవత్సరాల పాటు అసలు తనకు తిరుగు ఉండదు...చంద్రబాబు నథింగ్ అంటూ బహిరంగంగా మాట్లాడిన జగన్ లాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మాట్లాడిన మాటలు చూస్తే తెలుస్తుంది. చంద్రబాబు సర్కారు ప్రమాణస్వీకారం చేసింది జూన్ జూన్ 12 న అయితే...ఓటమి తర్వాత వారం రోజుల్లో పార్టీ నేతలతో సమావేశం అయిన జగన్ ...శిశుపాలుడిలా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి అని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు. అంటే ప్రభుత్వం వచ్చి నిండా పదిరోజులు కూడా కాకముందే ఏకంగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయి వంటి సీరియస్ కామెంట్స్ చేయటం అంటే జగన్ పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది అనే అభిప్రాయం వైసీపీ నేతల నుంచే వ్యక్తం అవుతున్నాయి. తాజాగా వినుకొండ నియోజకవర్గంలో జరిగిన ఒక వైసీపీ కార్యకర్త హత్య ఉదంతంపై మాట్లాడుతూ జగన్ ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు.

                                                                  కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా నిండా రెండు నెలలు కూడా కాలేదు. కానీ జగన్ మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలనే అత్యంత సీరియస్ డిమాండ్ చేయటంతో పాటు ఇదే అంశంపై దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు నిర్ణయం తీసుకోవటం వైసీపీ వర్గాలను షాక్ కు గురిచేస్తోంది. అధికార పార్టీ చేసే తప్పులను ఎత్త్తి చూపటం, దాడులకు గురవుతున్న కార్యకర్తలకు అండగా నిలబడటం తప్పు కాకపోయినా..ఒక పార్టీ పవర్ లోకి వచ్చి ఇంకా నిండా రెండు నెలలు కూడా కాకముందే చంద్రబాబు పాపాలు పండుతున్నాయి అని చెప్పటం...ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్...ఢిల్లీ ధర్నా వంటి సీరియస్ నిర్ణయాలు చూస్తుంటే జగన్ లో ఫ్రస్ట్రేషన్ పీక్ కు చేరినట్లు కనిపిస్తోంది అనే చర్చ వైసీపీ నేతల్లోనే సాగుతోంది. ఇప్పుడే ఇంత ఇంత సీరియస్ కామెంట్స్ ...డిమాండ్స్ చేసి వచ్చే నాలుగు సంవత్సరాల పదినెలల పాటు ఏమి చేస్తారు అనే చర్చ సాగుతోంది. అది అధికార పార్టీ అయినా.. ప్రతిపక్షం అయినా చేసే పనులు ప్రజలకు కనెక్ట్ అయ్యేలా ఉంటేనే ఎవరికైనా మనుగడ ఉంటుంది. కానీ జగన్ మాటలు..చర్యలు చూస్తుంటే అసాధారణంగా ఉంటున్నాయి అనే చర్చ పార్టీ నేతల్లో సాగుతోంది.

                                              నెల్లూరు జైలు ముందు, తాజాగా వినుకొండ లో జగన్ మీడియా ముందు చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయనే చర్చ కూడా సాగుతోంది. గత ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత జగన్ క్షేత్ర స్థాయి లో వాస్తవ పరిస్థితులను గుర్తించటానికి సిద్ధంగా లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత పలు అంశాలపై జగన్ స్పందిస్తున్న తీరు కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు గెలిపించిన ప్రజలు మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం చేశారు అనే విషయంలో ఇప్పటికి సరైన ఆత్మపరిశీలన లేకుండా...ఆత్మ వంచన చేసుకుంటున్నాడు అనే అభిప్రాయం పార్టీ నేతల్లో ఉంది. జగన్ ఇదే వైఖరితో వ్యవహరిస్తే రాబోయే సంవత్సరాల్లో పార్టీ నేతలు ఎవరి దారి వాళ్ళు చూసుకునే అవకాశాలు లేకపోలేదు అని చెపుతున్నారు. వైసీపీకి బలం ఆయనే...పెద్ద బలహీనత కూడా ఆయనే అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News