కూటమి మేనిఫెస్టో ను బీజేపీ ఓన్ చేసుకోదా?!

Update: 2024-04-30 10:38 GMT

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జన సేన కూటమిలో బీజేపీ చేరినా కూడా ఆ పార్టీ తీరు మొదటి నుంచి అనుమానాస్పదంగానే ఉంది. కూటమి తరపున తొలి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్న ప్రధాని మోడీ వ్యవహరించిన తీరు కూడా అనేక అనుమానాలకు కారణం అయింది. ఇప్పుడు మరో సారి అలాంటి ఘటనే జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కూటమి తరపున ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ రాష్ట్ర ఇంచార్జి సిద్దార్థ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఇంతరవరకు బాగానే ఉంది. కానీ ఉమ్మడి మేనిఫెస్టో పై కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు, జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో లు మాత్రమే ఉన్నాయి. దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె పీ నడ్డా ఫోటో కానీ...బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురేందేశ్వరి ఫోటో కానీ లేవు. దీంతో బీజేపీ ఈ మేనిఫెస్టో ను ఓన్ చేసుకోవటానికి సిద్ధంగా లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన వివరాల ప్రకారం మేనిఫెస్టో పై బీజేపీ నేతల ఫోటో వాళ్లే వద్దు అని చెప్పినట్లు సమాచారం. పొత్తులో భాగంగా బీజేపీ కి పది అసెంబ్లీ, ఆరు లోక్ సభ సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇదే బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సెపరేట్ గా మేనిఫెస్టో విడుదల చేసింది. అలాంటిది ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో పోటీ చేస్తూ మేనిఫెస్టో ను ఓన్ చేసుకోకపోవడం ఆ పార్టీ తీరుపై పలు అనుమానాలు కలిగిస్తోంది.

                                   ఇప్పటికి బీజేపీ అధికార వైసీపీ కి అనుకూలంగా వ్యవహరిస్తోంది అనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో ఉంది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ఒకరి వైపు మొగ్గు చూపకుండా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అవకాశం కల్పించటం కోసమే పొత్తు పెట్టుకున్నట్లు ఒక సీనియర్ నేత వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ కి ఉన్న ఓటు బ్యాంకు చాలా పరిమితం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తాజాగా జన సేన సింబల్ గాజు గ్లాస్ ను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు అంటే.. ఇది అంతా తెర వెనక బీజేపీ మద్దతు లేకుండా జరగదు అనే అనుమానాలను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ను బీజేపీ ఎండార్స్ చేసింది అని చెపుతున్నా దానిపై ఫోటో కు నో చెప్పరంటేనే వాళ్ళ ఉద్దేశం అర్ధం చేసుకోవచ్చు.ఈ వ్యవహారం పై సిద్దార్ద్ నాధ్ సింగ్ కూడా స్పందించారు. ఈ మేనిఫెస్టోకు తమ మద్దతు ఉంది అని..ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది అని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో మేం మేనిఫెస్టో విడుదల చేశాం. తాను ఇక్కడ ఉన్నానంటేనే బీజేపీ మద్దతు ఉందని అర్థం అన్నారు. అయితే పొత్తులో ఉండి కూడా మేనిఫెస్టో పై ఫోటో కు నో చెప్పరంటేనే బీజేపీ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

Tags:    

Similar News