టాలీవుడ్ సర్కిళ్ళతోపాటు రాజకీయాల్లో వర్గాల్లో శుక్రవారం ఉదయమే ఓ ఆసక్తికర చర్చ. అదేంటి అంటే ఏపీ సీఎం జగన్ పై తెరకెక్కనున్న సినిమా. ఈ ఆసక్తికర వార్తను డెక్కన్ క్రానికల్ పత్రిక ప్రచురించింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కించిన సినిమా యాత్ర ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్రతో సినిమా తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. జగన్ పాత్ర పోషించేందుకు అవసరమైన నటుడు ఎంపిక కూడా పూర్తయింది. తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా సినిమాగా దీన్ని తెరకెక్కించనున్నారు.
జగన్ పాత్రకు స్కామ్ 1992 హీరో ప్రతీక్ గాంధీ ఎంపిక చేశారని డీసీ తన కథనంలో పేర్కొంది. ఇది స్టాక్ మార్కెట్ లో జరిగిన స్కామ్ ఆధారంగా తెరకెక్కిన సినిమా. ప్రతీక్ గాంధీలో జగన్ తరహా పోలికలు ఎన్నోఉన్నాయని గుర్తించి ఆయన్ను దీనికి ఎంపిక చేశారు. ఈ సినిమా పాత్ర గురించి ప్రతీక్ తో సంప్రదించగా..ఇది చేయటానికి ఆయన ఎంతో ఉత్సాహంతో అంగీకరించారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ కొత్త పార్టీ పెట్టి ప్రజా నాయకుడిగా ఎలా ఎదిగారన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు. అందులో ప్రధానంగా జగన్ నిర్వహించిన రికార్డు పాదయాత్రకు కూడా చోటు ఉండటమే సహజమే. జగన్ పాత్ర పోషించనున్న ప్రతీక్ గాంధీని పైన చిత్రంలో చూడొచ్చు.