క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో నారా లోకేష్ కు రెవెన్యూ తో ఉప ముఖ్యమంత్రి!
టీడీపీ వర్గాల్లో విస్తృత చర్చ
త్వరలో జరిగే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో ఆంధ్ర ప్రదేశ్ రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శాఖ మారుతుందా?. లేక ఏకంగా మంత్రి పదవే పోతుందా?. ఇదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం. తొలి సారి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న ఆయనకు అసలు రెవెన్యూ శాఖ ఇవ్వటమే పెద్ద సంచలనంగా మారింది. విచిత్రం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం కొలువుతీరి ఆరు నెలలు కూడా దాటక ముందే ఏకంగా మంత్రులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావటం కలకలం రేపుతోంది. అయితే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మంత్రి వర్గంలో ఈ వ్యవహారం అంతా నివురు గప్పిన నిప్పులాగా ఉంది అనే ప్రచారం కూడా సాగుతోంది. కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు చేసే భారీ భారీ దోపిడీలు, సెటిల్మెంట్స్ వదిలేసి కొంత మంది టార్గెట్ గా ఎంచుకుంటున్నారు అనే ప్రచారం కూడా ఉంది. పై వాళ్ళు చేస్తున్న అడ్డగోలు పనులు చూసే కొంత మంది మంత్రులు..ఎమ్మెల్యేలు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనే చర్చ పార్టీ నాయకుల్లోనే సాగుతోంది. మార్చి తర్వాత జనసేన తరపున ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు మంత్రి పదవి చేపట్టబోతున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిగే పునర్వ్యవస్థీకరణలో నారా లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వటంతో పాటు అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖ కూడా ఇచ్చే అవకాశం ఉంది టీడీపీ వర్గాలు చెపుతున్నాయి.
ఇప్పుడు ఉన్న మానవ వనరుల శాఖను తప్పించి ఉప ముఖ్యమంత్రి గా రెవెన్యూ తో పాటు ఐటి శాఖలు కొనసాగించే అవకాశం ఉంది అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెవెన్యూ శాఖ అయితే నేరుగా ప్రజలతో సంబంధాల ఏర్పాటు తో పాటు జిల్లాల్లో కూడా ఇంప్యాక్ట్ చూపించే అవకాశం ఉంది అన్నది కొంత మంది భావన. అయితే ప్రస్తుతం రెవిన్యూ శాఖలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరుగుతున్నాయా అనే అనుమానాలను కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అత్యంత కీలక మైన రెవిన్యూ శాఖలో కీ ప్రభుత్వంలోని పవర్ ఫుల్ మంత్రి దగ్గరే ఉంది అనే ప్రచారం కూడా పార్టీ నాయకుల్లో ఉంది.