ఏపీలో ప్రస్తుతం వినాయక ఉత్సవాలకు సంబంధించి వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. హైకోర్టు బుధవారం నాడు దీనికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ (పబ్లిక్) ప్రదేశాల్లో ఉత్సవాలు వద్దన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు ఇచ్చింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో జరిగే వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కులేదని హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని కోర్టు సూచించింది. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లు అయింది.