అప్పుడు అలా..ఇప్పుడు ఇలా

Update: 2024-10-08 15:10 GMT

Full Viewప్రతిపక్షంలో ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇసుక సమస్యపై పదే పదే గళమెత్తేవారు. ప్రభుత్వం ఇసుక సరఫరా చేయకపోవటం వల్ల నిర్మాణ రంగం కుదేలు అవుతుంది, కార్మికులకు ఉపాధి లేకుండా పోతుంది అంటూ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు....ఆయనతో మరో కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా ఇదే అంశంపై పలు మార్లు స్పందించారు. భవన నిర్మాణ కార్మికులతో సమావేశాలు కూడా పెట్టారు అప్పటిలో. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గా ఉంటే...నాదెండ్ల మనోహర్ కూడా మంత్రి గా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండి విమర్శలు చేసిన వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అదే సమస్య తలెత్తినా నోరు తెరవటం లేదు. దీంతో వీళ్లిద్దరు ఇప్పుడు నోటికి ప్లాస్టర్ వేసుకున్నారా అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వైపు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెపుతున్నా కూడా ఈ విధానంపై పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

                                                              రవాణా చార్జీలు మరీ ఎక్కువగా ఉండటం ఒకటి అయితే...అవసరానికి ఇసుక దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే విషయంపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వంలో ఉండి...పరిష్కరించాల్సిన కీలక స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు మౌనంగా ఉండటం చర్చనీయాంశగా మారింది. అంటే వీళ్ళు తమ శాఖల విషయాలు తప్ప ..ప్రభుత్వంలో ఏమి జరిగినా పట్టించుకోరా అన్న చర్చ కూడా సాగుతోంది. విచిత్రం ఏమిటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సన్నిహిత విద్యుత్ కంపెనీలతో కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు లాలూచీ పడ్డారు అని..ఈ వ్యవహారంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని చెపుతున్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన మంత్రులు మౌనంగా ఉంటున్నారు అంటే..ఎవరికీ దక్కాల్సిన వాటాలు వాళ్లకు దక్కుతున్నాయి అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకునే ఎంతో కీలకం అయిన ఇసుక విషయంలో కూడా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారా అన్న చర్చ టీడీపీ నాయకుల్లో కూడా సాగుతోంది.

Tags:    

Similar News