అమరావతిపై సిట్..హైకోర్టు స్టే

Update: 2020-09-16 06:49 GMT

అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో మరో స్టే వచ్చింది. మంగళవారం రాత్రి హైకోర్టు ఏసీబీ విచారణపై ముందుకెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. బుధవారం నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అమరావతి వ్యవహారంలో తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆదేశించింది. అమరావతి భూ కుంభకోణంతోపాటు పలు అంశాలను పరిశీలించేందుకు వైసీపీ ప్రభుత్వం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సిట్ విచారణపై తాజాగా హై కోర్టు స్టే విధించింది. టీడీపీ నేతలు ఆలపాటి రాజ, వర్ల రామయ్యలు వేసిన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

రఘురామ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌కు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. పోలీస్ స్టేషన్‌కు ఉన్నటువంటి అధికారాలను సిట్‌కు ఇవ్వడం న్యాయబద్దం కాదని, ఈ సిట్‌ను తక్షణం నిలుపుదల చేయాలని టీడీపీ నేతలు తమ పిటీషన్ లో కోరారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం సిట్‌పై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మరో ప్రభుత్వం సమీక్షించే అధికారం లేదని పిటీషనర్ తరపు న్యాయవాదులు వాదించారు.

Similar News