శ్రీశైలం ప్రమాద ఘటనపై సీఐడీ విచారణ

Update: 2020-08-21 10:17 GMT

శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కెసీఆర్ సీఐడి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సిఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సిఐడి అడిషనల్ డి.జి.పి. గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటివరకూ అందిన సమాచారం ఐదుగురు మరణించినట్లు నిర్ధారించారు. శ్రైశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని సిఎం ఆకాంక్షించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో వైద్య చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

 

Similar News