ఏపీ సర్కారు ఏ మాత్రం రాజీపడటంలేదు. సలహాదారుల నియామకం..సంఖ్యపై విమర్శలు ఎన్ని వస్తున్నా తన పని తానుచేసుకుపోతోంది. తాజాగా ఏపీ పబ్లిక్ పాలసీ సలహాదారు పదవికి కె. రామచంద్రమూర్తి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన అలా రాజీనామా చేశారో లేదో.. ఏపీ సర్కారు మరో కొత్త సలహాదారును నియమించింది. ఈ మేరకు గురువారం నాడు జీవో వెలువడింది. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డిని నియమించారు.
రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్ ర్యాంక్ హోదాలో నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వ్యవసాయ సంబంధిత అంశాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. అంబటి కృష్ణారెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా యర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామానికి చెందిన వ్యక్తి. సీఎం పేషీ నుంచి ఆగస్టు 26 తేదీతో నోట్ వచ్చింది...ఆగస్టు 27న జీవో జారీ అయింది.