ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలంలో అమరరాజా ఇన్ ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిన 483.27 ఎకరాల్లో 253 ఎకరాలు వెనక్కి తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఏపీఐఐసీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంస్థకు ఇచ్చిన భూమిలో కేవలం 229 ఎకరాలు మాత్రమే వినియోగించిందని 253 ఎకరాలు ఎలాంటి ఉపయోగం లేకుండా అలా ఉంచారని తెలిపారు.
దీంతోపాటు 2100 కోట్ల రూపాయలు పెట్టుబడి, 20 వేల మందికి ఉపాధి కల్పిస్తామనే హామీని కూడా అమలు చేయలేదని జీవోలో పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఈ కంపెనీలో 4310 మందికి మాత్రమే ఉపాధి దక్కిందని పేర్కొన్నారు. భూ కేటాయింపు నిబంధనలను ఉల్లంఘించటంతోపాటు 60 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఉపయోగించకుండా పెట్టినందుకు దీన్ని వెనక్కి తీసుకోవటానికి అనుమతిస్తూ సర్కారు ఏపీఐఐసీకి ఆదేశాలు జారీ చేసింది.