తెలంగాణలో మరో పెట్రోల్ దాడి

Update: 2019-11-19 08:20 GMT

తెలంగాణాలో పెట్రోల్ దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ తహశీల్దార్ పై పెట్రోల్ పోసి సజీవదహనం చేసిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరవక ముందే అలాంటిదే మరో సంఘటన. కరీంనగర్ జిల్లాలో ఇది చోటు చేసుకుంది. రెవెన్యూ సీనియర్ అసిస్టెంట్ పై ఓ రైతు పెట్రోల్ పోశాడు. తమ భూ సమస్య పరిష్కరించడం లేదని ఆగ్రహించిన రైతు ఈ పనికి పాల్పడినట్లు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఇది జరిగింది. లంబాడి పల్లి గ్రామానికి చెందిన రైతు కనకయ్య సీనియర్ అసిస్టెంట్ రామచంద్రన్ పై పెట్రోల్ పోసి హల్ చల్ చేశాడు.

అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. సంఘటన జరిగిన వెంటనే రెవెన్యూ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రైతును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే అన్నదమ్ముల వివాదం వల్లే పట్టాలు ఇవ్వలేకపోయామన్నది రెవెన్యూ ఉద్యోగుల వాదనగా ఉంది. హైదరాబాద్ శివార్లలో తహశీల్దార్ పై పెట్రోల్ దాడి జరిగిన ఘటన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు హడలిపోతున్నారు.

 

Similar News