వరంగల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేవలం ఘటన జరిగిన 48 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి మానవమృగంగా వ్యవహరించిన ప్రవీణ్ కు ఉరిశిక్ష ఖరారు చేసింది. వరంగల్ నగరంలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో వరంగల్ జిల్లా కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు జిల్లా కోర్టు మొదటి అదనపు జడ్జి జయకుమార్ సంచలన తీర్పు వెలువరించారు. తొమ్మిది నెలల చిన్నారి శ్రీహితపై జూన్ 18న నిందితుడు ప్రవీణ్ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సభ్యసమాజం సిగ్గుపడే రీతిలో అత్యంత కిరాతకంగా వ్యవహరించిన ప్రవీణ్ తరఫున ఎవరు వాదించరాదని వరంగల్ బార్ అసోసియేషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో 2019 జూన్ 18న మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. హన్మకొండలోని కుమార్పల్లి జెండా ప్రాంతానికి చెందిన జంపాల యాదగిరి, నిర్మల దంపతులకు కుమారులు భరత్, నరసింహరాజుతో పాటు కుమార్తె రచన సంతానం.
రచనను మూడేళ్ల క్రితం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ సమీప మాడుగుల గ్రామానికి చెందిన కమ్మోజీ జగన్కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి 9 నెలల శ్రీహిత ఉంది. జూన్ 17 రాత్రి భోజనం చేశాక నిద్రించేందుకు డాబాపైకి వెళ్లారు. అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత రచనకు మెలకువ రాగా పక్కనే పాప శ్రీహిత లేదని గ్రహించి ఆందోళన చెందింది. రచన తమ్ముడు భరత్ బైక్పై వెతకడానికి బయలుదేరాడు. ఇంటి పక్క గల్లీలో ఓ వ్యక్తి భుజాన టవల్లో చుట్టుకుని పాపను తీసుకెళ్తున్నట్లు గుర్తించి కేకలు వేశాడు. దీంతో ఆ మానవ మృగం భరత్ను చూసి పాపను ఒక్కసారిగా నేలపై విసిరేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే, దుండగుడిని పట్టుకున్న భరత్ చితకబాదాడు. చిన్నారిని చూసేసరికి ఎలాంటి కదలిక లేకపోవడం.. శరీరం నుంచి అధిక రక్తస్రావం కావడాన్ని గుర్తించాడు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి శ్రీహితను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, చిన్నారి మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించడంతో గుండెలవిసేలా ఏడ్చారు. శ్రీహిత మృతదేహానికి వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యనిపుణుడు డాక్టర్ రజాం అలీఖాన్ అసలు విషయం వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు నివేదికలో తేలిందని పేర్కొన్నారు. అత్యాచారం చేయడమే కాకుండా ఊపిరి ఆడకుండా చేసి హతమార్చినట్లు తేలిందని తెలిపారు.