జగన్ కొట్టే ప్రతి బాల్ సిక్సర్..బౌండరీలే

Update: 2019-07-22 15:03 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై గవర్నర్ నరసింహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలన ప్రతి బాల్ సిక్సర్, బౌండరీలను తాకుతున్నట్లుగానే ఉందని అన్నారు. క్రికెట్ పరిభాషలో మాట్లాడిన ఆయన రాబోయే రోజుల్లో జగన్ మరిన్ని సెంచరీలు సాధించాలని వ్యాఖ్యానించారు. ఏపీ నూతన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన ఈ నెల24న భాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకూ ఏపీకి సేవలు అందించిన నరసింహన్ కు ఏపీ ప్రభుత్వం విజయవాడలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో గవర్నర్ దంపతులు, సీఎం జగన్మోహన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వీడ్కోలు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దంపతులు నరసింహన్‌, విమలా నరసింహన్‌ను సత్కరించి, జ్ఞాపికను అందచేశారు.

గవర్నర్ నరసింహన్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు చిన్నప్పుడు విజయవాడలోనే అక్షరాభాస్యం జరిగిందని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ‘ఏపీకి గవర్నర్‌గా వస్తానని నేనెప్పుడూ అనుకోలేదు. గడిచిన పదేళ్లు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లాంటిది. గవర్నర్‌గా ఈ నరసింహం వెళ్లిపోతున్నా...అహోబిలం, సింహాచలం, మంగళగిరి నరసింహులు మీతోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, అవినీతిరహిత రాష్ట్రం కోసం వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగాలి. నాకు సహకరించిన మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు’’ అని తెలిపారు. గవర్నర్ నరసింహన్ తనకు పలు అంశాల్లో ఎన్నో సూచనలు, సలహాలు అందించారని జగన్ పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ మరికొంత కాలం ఉంటే బాగుండేదని జగన్ వ్యాఖ్యానించారు.

 

Similar News