టూల్ కిట్ తరహాలో తప్పుడు ప్రచారం

Update: 2023-07-12 04:18 GMT

 బిఆర్ ఎస్ లో ఓటమి భయమే దీనికి కారణమా?

ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే స్వయంగా ఫేక్ ప్రచారానికి దిగింది. అది కూడా ప్రత్యర్థి పార్టీ ని రాజకీయంగా దెబ్బ తీసేందుకు. మంగళవారం నాడు తెలంగాలో కొంత మంది బిఆర్ఎస్ మంత్రులు, ఆ పార్టీ నాయకులు చేసిన హంగామా చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని చూసి అధికార బిఆర్ఎస్ ఎంత భయపడుతుందో స్పష్టంగా కనపడింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉచిత విద్యుత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 95 శాతం మంది రైతులు మూడు ఎకరాల లోపు ఉన్న వారే ..ఒక్క ఎకరానికి నీరు పారించటానికి గంట పడుతుంది...మూడు గంటలు చాలు...మొత్తం మీద ఏమినిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది అని ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ల కోసం సీఎం కెసిఆర్ ఉచిత విద్యుత్ పేరుతో మభ్య పెడుతున్నారు అంటూ విమర్శలు చేశారు. అంతే టూల్ కిట్ తరహాలో అందరూ ఒకటే మాట అందుకున్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన ఎనిమిది గంటల అంశాన్ని, సీఎం కెసిఆర్ కమీషన్ల విషయాన్ని పక్కన పెట్టి రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అన్నారు అనే అంశాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫేక్ ప్రచారం స్టార్ట్ చేశారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఎనిమిది గంటల అంశం ప్రస్తావించి ఉంటే ఇది తప్పు కాదు. కానీ ఆ విషయాన్ని కావాలని పక్కకు పెట్టి స్వయంగా మంత్రి కెటిఆర్ దగ్గర నుంచి మిగిలిన మంత్రులు అందరూ తప్పుడు ప్రచారానికి తెర తీశారు. ఒకే సమయంలో నిమిషం కూడా గ్యాప్ లేకుండా మాట్లాడిన వాటిలో తమకు కావాల్సిన వాటినే తీసుకుని ఫేక్ ప్రచారానికి స్వయంగా రాష్ట్ర మంత్రులు దిగటం అంటే బిఆర్ ఎస్ ఎంత భయంలో ఉండదో అనే చర్చ సాగుతోంది.

                                                టూల్ కిట్ అని ఎందుకు అనాల్సి వస్తోంది అంటే అటు మంత్రులు..ఇటు బిఆర్ ఎస్ సోషల్ మీడియా టీం లు కూడా ఏక కాలంలో ఈ ఫేక్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చాయి. చివరకు ప్రభుత్వంలో లక్షలకు లక్షలు జీతం తీసుకునే తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ మీడియా డైరెక్టర్ గా ఉన్న దిలీప్ కొణతం కూడా అదే పని చేశారు. అయన తప్పుడు ప్రచారం చేయటమే కాదు...అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పేస్ బుక్ లో అయన పోస్ట్ ఇలా ఉంది. ‘తెలంగాణలో వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలు. గంట కరెంట్ ఇస్తే ఒక ఎకరం తడుస్తుంది. కేసీఆర్ అనవసరంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాడు:- అమెరికా పర్యటనలో బిగ్ బ్రోకర్ రైఫిల్ రెడ్డి. అసలు వీడు ఎన్నడన్నా పొలం మొహం చూసినోడేనా?. ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీకి మూడు సీట్లు ఇస్తే చాలు తెలంగాణలో!’ అంటూ రాసుకొచ్చారు. మంత్రుల దగ్గర నుంచి ఇలా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఫేక్ ప్రచారాలకు దిగి..అసలు విషయాన్ని ఎడిట్ చేసి తమకు కావాల్సిన అంశాన్ని మాత్రం ప్రచారంలోకి తెచ్చారు. ఇది చూసిన జర్నలిస్టులు కూడా ప్రభుత్వమే ఇంత దారుణంగా ప్రచారం చేయటమా అంటూ విస్తుపోతున్నారు. వీడియో సాక్షిగా ఉన్న విషయాన్ని కూడా వీళ్ళు ఏమార్చి మూడు గంటల అంశాన్ని మాత్రమే ప్రచారం చేశారు అంటే పరిస్థితి రాబోయే రోజుల్లో ఎంత భయంకరంగా మారబోతుందో అనే దానికి ఇది ఒకే సంకేతం అని చెపుతున్నారు అధికారులు కూడా. అదే సమయంలో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి వాతావరం అనుకూలంగా మారుతున్నా తరుణంలో రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై వ్యాఖ్యలు చేసి పార్టీని ఇరకాటంలోకి నెట్టాడు అనే అభిప్రాయం కూడా పార్టీ నేతల్లో ఉంది.

Tags:    

Similar News