Full Viewఏపీలో ఇప్పుడు అత్యంత శక్తివంతంగా ఉన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ శాపనార్ధాల సీఎంగా మారుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీపై విమర్శలు చేయటం సహజమే. వైసీపీ కూడా ప్రతిపక్షంలో ఉండగా అదే పని చేసింది. కానీ ఇప్పుడు సీఎం జగన్ విచిత్రంగా తన పాలన చూసి..సంక్షేమ కార్యక్రమాలు చూసి మీడియా, ప్రతిపక్ష పార్టీలు ఎసిడిటితో బాధపడుతున్నారని..ఎసిడిటికి మందులేదని..ఇలా చేస్తే బీపీలు వచ్చి.హార్ట్ ఎటాక్ లు వచ్చి టిక్కెట్ తీసుకుంటారని పదే పదే వ్యాఖ్యానించారు. అంతే కాదు..నంద్యాలలో శుక్రవారం నాడు జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ తనను ఏమీ పీకలేరు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మంత్రులు ఇంత కంటే దారుణంగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఓ బహిరంగ సభలో యాక్షన్ చేస్తూ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయటం కలకలం రేపిందనే చెప్పాలి.
ఇక్కడ అసలు విచిత్రం ఏమిటంటే సీఎం జగన్ ఎవరిని అయితే తిట్టారో ఆ పత్రికలే జగన్ వ్యాఖ్యలను బ్యానర్లుగా ప్రచురించాయి. ఇందులో ఎవరి ప్రయోజనాలు వారు చూసుకుని ఉంటారనటంలో సందేహం లేదు. జగన్ అన్న మాటలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలన్నది వాటి ఉద్దేశం కావొచ్చు. సహజంగా సీఎం జగన్ లేదా వైసీపీ నేతలు ఎవరైనా ప్రతిపక్ష పార్టీలపై, ప్రత్యర్ధి మీడియాపై విరుచుకుపడితే సాక్షి ప్రముఖంగా ఫస్ట్ పేజీలో ప్రచురిస్తుంది. కానీ అందుకు భిన్నంగా సాక్షి నంద్యాల సమావేశం కవరేజ్ ఇచ్చింది. అది కూడా ముఖ్యంగా ఈ పరుష వ్యాఖ్యల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు ఈ పత్రిక చూసిన వారెవరికైనా తెలుస్తుంది. సాక్షి కూడా పీకుడు భాషను హెడ్డింగ్ లో పెడితే లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని భావించే ఇలా చేసినట్లు కన్పిస్తోంది.