Full Viewఆంధ్రప్రదేశ్ సర్కారుకు మరో కొత్త సలహాదారు రానున్నారు. ప్రముఖ నటుడు ఆలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొద్ది రోజుల క్రితం ఆలీ ఏపీ సీఎం జగన్ తో భేటీ కావటం...అప్పట్లో ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ ప్రచారం కూడా జరిగింది. కానీ అదేమీ జరగలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించేందుకు ఉద్దేశించిన ఫైలు సీఎం జగన్ దగ్గరకు చేరిందని..దీనికి సంబంధించి ఆదేశాలు ఎప్పుడైనా రావొచ్చని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఆలీతోపాటు మరో సినిమా నటుడు పోసాని కృష్ణ మురళి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్ డీసీ) ఛైర్మన్ గా నియమించనున్నారు. ఆలీతోపాటు ఈయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు ఒకేసారి వస్తాయని వైసీపీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఎఫ్ డీసీ ఛైర్మన్ గా నియమితులైన విజయ్ చందర్ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారనే అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది.
పోసాని కృష్ణ మురళి అటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. కొద్ది రోజుల క్రితం అయితే పవన్ కళ్యాణ్ పై మరీ వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో దూషణలు చేశారు. ఇది అప్పట్లో పెద్ద దుమారపే రేపింది. సహజంగా చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను ఆ రేంజ్ లో తిట్టడమే అర్హతగా ఆయనకు పదవి ఖాయం అయిపోయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే ఇంతకు మించి అర్హత ఏమి ఉంటుందని ఓ నాయుకుడు వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా వేగవంతం చేసి జిల్లాల వారీగా నియమాకాలు చేపట్టింది. ఇప్పుడు ఆలీ, పోసాని కృష్ణ మురళి ని కూడా ప్రభుత్వంలోకి తీసుకుని వీరి సేవలను పార్టీకి ఉపయోగించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రచారంలో విషయంలో తాము చాలా పూర్ అని చెప్పుకునే వైసీపీ సర్కారు ప్రభుత్వ ప్రకటనలు..ప్రచారం విషయంలో చంద్రబాబును మించిపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.