సుబ్బారెడ్డి..విజయసాయిరెడ్డి చెప్పింది తప్పు

Update: 2024-10-29 14:11 GMT
సుబ్బారెడ్డి..విజయసాయిరెడ్డి చెప్పింది తప్పు
  • whatsapp icon

గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో వై ఎస్ జగన్, షర్మిల ఆస్తి వివాదం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. వైసీపీ నేతలు అయితే ఈ విషయంలో విజయమ్మ మాటను కూడా తాము పరిగణనలోకి తీసుకోమని ముందే చెప్పేశారు. ఎందుకంటే జడ్జి పాత్ర పోషించే వాళ్ళు తటస్థంగా ఉండాలికాని ..ఒక వైపు ఉండకూడదు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. విజయమ్మ తన కూతురు షర్మిల వైపు ఉన్నారు కాబట్టి ఆమె చెప్పే మాటలు చెల్లుబాటు కావు అనే రీతిలో ముందే తేల్చేశారు. ఈ తరుణంలో వై ఎస్ విజయమ్మ మంగళవారం సాయంత్రం ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఇందులో ఆమె తన వైఖరిని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో సుబ్బారెడ్డి తో పాటు విజయసాయిరెడ్డి చెప్పింది తప్పు అని తేల్చేశారు. ఇది వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ని మరింత ఇరకాటంలోకి నెట్టడం ఖాయం అనే చెప్పొచ్చు. మరి ఈ లేఖపై వైసీపీ...ముఖ్యంగా జగన్ తప్ప ఎవరు స్పందించినా అందుకు పెద్దగా విలువ ఉండేదే అనే చెప్పొచ్చు. మరి విజయమ్మ ఇంత ఓపెన్ గా బయటకు వచ్చి లెటర్ రాసిన తర్వాత జగన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు...పాత వైఖరికే కట్టుబడి ఉంటారా లేక ఏమైనా మారతారా అన్నది చూడాలి. విజయమ్మ లేఖ తర్వాత జగన్ ఒప్పందం ప్రకారం ఆస్తులు ఇవ్వటనికి అంగీకరించకపోతే ..ఈ మొత్తం వ్యవహారం కోర్ట్ లకు ఎక్కటం ఖాయంగా కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

విజయమ్మ లేఖ పూర్తి పాఠం

రాజశేఖర్ రెడ్డి ని ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికీ మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన.

ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా చాలా బాదేస్తుంది. పెద్దలంటారు.. ఇంటి గుట్టు వ్యాధి రట్టు.. తెరిచిన పుస్తకం అని రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అనేవారు. అయితే ఇలా కాదు. చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని నా కళ్ళముందే జరిగి పోతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. అబద్దాల పరంపర కొనసాగుతుంది. తెలిసి కొంత తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు. ఎంతగానో అవి దావాలనంగా ఎక్కడెక్కడికో పోతున్నాయి. ఇవి కంటిన్యూ అవ్వకూడదు. నా పిల్లలిద్ధరికీ కాదు.. చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నేను మీ ముందుకు ఈ విషయంగా రాకూడదని అనుకున్నా. అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నా… ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు. మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. ఇది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర్ రెడ్డి గారికి మేము ఎంతో.. మీరు కూడా అంతే. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో.. మిమ్మల్ని అంతగానే ప్రేమించారు.

                                                      మీరు కూడా అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు. అంతెందుకు.. రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్యనుంచి వెళ్ళిపోయాక నా పిల్లలను, ఆయన ఉన్నప్పటి కంటే ఎక్కువగా ప్రేమించి, ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అది నేను ఎన్నటికీ మరిచి పోలేను. అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటూ.. హృదయ పూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపు కుంటున్నాను. మీ అందరికీ మీ ఆడబిడ్డగా రెండు చేతులు ఎత్తి మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియా లో కల్పిత కథలు రాయవద్దు. దూషణలు చేయవద్దు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే.. ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు. Blood is thicker than water. వాళ్ళు ఇద్దరు సమాధాన పడతారు. మీరెవరు రెచ్చ గొట్టవద్ధని నా మనవి. నేను నమ్మిన దేవుడు యేసయ్య.. సమాధాన కర్త. నా బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని నా నమ్మకం.

                                                                       ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి, ఇతరులు అందరూ… వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళు ప్రేమించే YSR గురించి అని మరిచి.. తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అని స్పృహ లేకుండా.. ఎన్నో అసత్యాలు చెప్పారు. YSR గారు బ్రతికి ఉండగానే ఆస్తులు పంచేశారు అని అన్నారు. ఇది అవాస్తవం. YSR గారు పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుండి, కొన్ని ఆస్తులు పాప పేరు మీద.. అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. YSR గారు బ్రతికి ఉండగనే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్ట్ చదివారు. అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ చదివి ఉండాల్సింది. YSR చేసింది పంపకం కాదు. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేరు మీద పెట్టారు అంతే.

                                         విజయసాయి రెడ్డి గారు ఆడిటర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. వైవి సుబ్బారెడ్డి ఈ ఇంటి బంధువుగా MOU పై సాక్షి సంతకం చేశారు. అయినా… మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్దాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెప్తున్న.వీరు ఇద్దరు నా పిల్లలు. వీరిని నేను, YSR గారు ఎంతో అపురూపంగా ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరు సమానమే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి మాట సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్న YSR గారి ఆజ్ఞ నిజం. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత గల కొడుకు గా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం. YSR గారి చివరి రోజుల్లో, జగన్ ఆయనకు ఇచ్చిన మాట " నాన్న నీ తర్వాత ఈ లోకంలో, పాప మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని " అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది "నాలో నాతో YSR అనే పుస్తకం"లో ఎప్పుడో రాశా.

                                       రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉండగా ఆస్తులు పంచలేదు. ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. అందరం కలిసి ఉన్నాం. అన్ని కుటుంబ ఆస్తులే. ఇక పంచుదాం అనుకొనే సరికి, ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్ గా సాయి రెడ్డి కి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి మన మధ్య నుంచి వెళ్ళిపోయాక.. 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లు కలిసి ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని, 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. MOU ప్రకారం జగన్ 60 శాతం.. పాపకు 40 శాతం అయితే, MOU కు ముందు...సగం సగం డివిడెండ్ తీసుకొనే వారు.. ఎందుకంటే పాపకు సమాన వాట ఉంది కాబట్టి. వీటి అన్నింటికీ అప్పుడు, ఇప్పుడు, నేనే సాక్షిని.

                                                                                              2019 లో సిఎం అయిన రెండు నెలలకు, డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్ లో జగన్ ప్రపోజల్. జగన్ చెప్పింది ఏంటంటే... ”పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు..నాకు అల్లుళ్ళు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు..కాబట్టి విడిపోదాం” అన్నాడు. అలా 2019 వరుకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో, నా సమక్షంలో , ఆస్తుల్లో ఇవి జగన్ కి, ఇవి పాప కి అని అనుకున్నారు. 2019 లో అప్పుడు రాసిన MOU నే ఈ MOU. ఇది జగన్ నోటితో చెప్పి.. ఆయన చేతితో రాసిన MOU నే ఇది. హక్కు ఉంది కాబట్టే పాప కి 200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారు. పాపకి హక్కు ఉంది కాబట్టే MOU రాసుకున్నారు. అఫిషియల్ గా రాసుకున్నారు. MOU లో పాపకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదు. జగన్ భాధ్యత గా ఇస్తున్నవి. అటాచ్ మెంట్ లో లేవు కాబట్టి, MOU లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, MOU లో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం, పాపకు వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవి కూడా ఇవ్వకుండ.. ఆటాచ్ మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా పాపకు అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతి సిమెంట్స్, సాక్షి మీడియా, YSR గారి ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది. 2019 వరకు కలిసి ఉన్నాము. షర్మిలమ్మ ను బిజినెస్ లో ఇన్వాల్వ్ చేయలేదు. అయినా షర్మిలమ్మ పాలిటిక్స్ లో జగన్ చెప్పినట్లు చేసింది. జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. జగన్ అధికారంలో రావడానికి పాప కృషి ఎంతో ఉంది.

                                                 జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే, చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా, అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి, నా ధర్మం. ఇంత మంది పెద్ద మనుషులు చెప్తున్న అబద్దాల మధ్య నిజం తెలియాలనే.. ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే... అయినప్పటికీ, వాళ్ళు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. రాజశేఖర్ రెడ్డి ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు. ఇంతటి వివాదం జరిగేది కాదు. ఆస్తుల విషయంపై నేనూ ఇలా రావాల్సిన అవసరం పడేది కాదు. అయినా దీని విషయంగా జరుగుతున్న రచ్చను చూసి.. నా మాటలు మాత్రమే ఆపుతాయనీ విశ్వసిస్తూ.. నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని.. మీ ముందుకు రావాల్సి వచ్చింది.

మరొక్కసారి మీ అడబిడ్డగా ప్రతి ఒక్కరినీ, ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని కోరుకుంటూ...

ఇట్లు

ప్రేమతో

వైఎస్. విజయ రాజశేఖర్ రెడ్డి

Tags:    

Similar News