ఏపీ సర్కారు తాను అనుకున్నట్లే ముందుకెళుతోంది. సినిమా టిక్కెట్ల వ్యవస్థ పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు నిర్ణయం తీసుకుంది. దీని కోసం కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లు కూడా ఆమోదింపచేసుకున్నారు. ఇందుకు అనుగుణంగా ఇప్పుడు సింగిల్ థియేటర్లతో పాటు మల్లీప్లెక్స్ లో టిక్కెట్ అమ్మకాలు అన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఈ అమ్మకాల కోసం కొత్త వెబ్ సైట్ రూపకల్పన బాధ్యతను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ ఎఫ్ టివిటిడిసి)కి అప్పగిస్తూ ప్రభుత్వం ఈ నెల 17న జీవో 143 జారీ చేసింది.
ఈ విషయం ఆదివారం నాడు వెలుగులోకి వచ్చింది. దీంతో కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక పూర్తిగా ప్రభుత్వ కంపెనీ నియమ, నిబంధనలకు లోబడి అమ్మకాలు చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆన్ లైన్ టిక్కెట్ విదానం ప్రవేశపెట్టేందుకు తన సమ్మతిని తెలియజేసిందని జీవోలో తెలిపారు. ఐఆర్సీటీసీ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రైవేట్ ఆన్ లైన్ సంస్థలు సినిమా టిక్కెట్ల విక్రయానికి ఛాన్స్ ఉండదు.