తెలంగాణ అక్ర‌మ ప్రాజెక్టులు సంద‌ర్శించాకే ఏపీకి రావాలి

Update: 2021-07-05 08:38 GMT

ఏపీ, తెలంగాణ ల మ‌ధ్య జ‌లజ‌గ‌డం లేఖ‌ల యుద్ధంగా మారుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ ఏపీ స‌ర్కారు వాద‌న త‌ప్పు అంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కెఆర్ ఎంబీ) కి లేఖ రాయ‌గా..సోమ‌వారం నాడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి లేఖ‌లు రాశారు. కేంద్రమంత్రులు గజేంద్ర షెకావత్‌, ప్రకాష్‌ జవదేకర్‌కు జగన్‌మోహన్‌రెడ్డి విడివిడిగా లేఖలు రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ మరోసారి సీఎం వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు చేశారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించాకే.. రాయలసీమ లిఫ్ట్‌ సందర్శించాలని కేఆర్‌ఎంబీని ఆదేశించాలని సీఎం కోరారు. నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని.. కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తోందని సీఎం జగన్‌ లేఖలో పేర్కొన్నారు. 'శ్రీశైలం ప్రాజెక్టులో నీటినిల్వలు ఉండకుండా తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకుంటోంది. ఈనెల 1 నుంచి ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించుకుంది. 796 అడుగుల నీటిమట్టం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని' సీఎం లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే శ్రీశైలం ప్రాజెక్టు ఎప్ప‌టికీ నిండ‌ద‌న్నారు.  'శ్రీశైలంలో 854 అడుగుల నీరు లేకుంటే కరువు ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించే అవకాశం లేదు. పాలమూరు రంగారెడ్డి, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను 800 అడుగుల వద్ద పర్యావరణ అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తోంది.

                                        ఈ అక్రమ ప్రాజెక్టు వల్ల శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉండే అవకాశాలు లేవని' సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో పేర్కొన్నారు. ఏపీపై వివ‌క్ష చూపించ‌వ‌ద్ద‌ని కోరారు. తెలంగాణ ప‌దే ప‌దే ఉల్లంఘ‌న‌లకు పాల్ప‌డిన ప‌ట్టించుకోవ‌ట్లేద‌న్నారు. . రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రి ప్రకాష్‌ జవదేకర్‌కు రాసిన లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. 'జూన్‌ 1 నుంచి విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. నాగార్జునసాగర్‌, కృష్ణా డెల్టా పరిధిలో ఇరిగేషన్‌ అవసరాలు లేకుండా తెలంగాణ నీటిని వినియోగిస్తోంది. విద్యుత్‌ ఉత్పత్తి కోసమే ఇప్పటి వరకు 19 టీఎంసీల నీటిని వినియోగించింది. 854 అడుగులకు చేరితే గానీ పోతిరెడ్డిపాడుకు నీటిని తీసుకునే అవకాశం లేదని'' లేఖలో సీఎం జగన్‌ పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలవనరుల కమిషనర్‌కు పూర్తి డీపీఆర్‌ను అందజేశామని.. రాయలసీమ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాల్సిందిగా కోరారు.

Tags:    

Similar News