ఏపీ మంత్రి కుమారుడికి లంచంగా బెంజ్ కారు

Update: 2020-09-18 07:09 GMT

అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు

తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేసులో ఏ14గా ఉన్న వ్యక్తి జయరాం తనయుడు ఈశ్వర్ కు ఖరీదైన బెంజ్ కారు బహుమతిగా ఇఛ్చారని తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాడు విశాఖపట్నంలో టీడీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఈ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన బెంజ్ కారు ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేశారు. మంత్రి కుమారుడికి ఇఛ్చిన బెంజ్ కారు పుట్టిన రోజు కానుక కాదని..అది లంచం అని ఆరోపించారు. ఈ విషయంపై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.

దీనిపై ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపించానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఇలాంటి సమయంలో జయరాంను మంత్రిగా కొనసాగించటం సరికాదన్నారు. మీడియా సమావేశం నుంచే అయ్యన్నపాత్రుడు అవినీతి నిరోధక శాఖ కాల్ సెంటర్ కు ఫోన్ చేసి అవినీతిపై ఫిర్యాదు చేశారు. ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కంపెనీలో అవినీతి జరిగింది. కుంభకోణంలో కార్మిక శాఖ మంత్రి జయరాం, ఆయన కుమారుడు ఈశ్వర్ ప్రమేయం ఉంది. మంత్రి కుమారుడు ఈశ్వర్ కు లంచంగా బెంజి కారు ఇచ్చారు అని తెలిపారు. ఈ కుంభకోణం విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Similar News