కరోనాపై ప్రజల్లో భయాందోళనలు తొలగించేందుకు ప్రయత్నించిన తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భూమన కుమారుడు అభినయ రెడ్డి కూడా ఇప్పటికే కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనా బాధితుల మృతదేహాల అంత్యక్రియలపై అపోహలు తొలగించేందుకు ఎమ్మెల్యే, కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్ భూమన కొద్దిరోజుల క్రితం స్వయంగా రంగంలోకి దిగారు.
కరకంబాడి రోడ్డు లోని గోవింద దామంలో కరోనా వైరస్ మృతదేహాలను ఖననంపై అపోహలు తొలగించేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనాతో చనిపోయినవారి మృత దేహాలకు ఆయన దహన సంస్కారాలు చేశారు. పీపీఈ కిట్లు ధరించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయినా సరే ఆయన కరోనా బారినపడాల్సి వచ్చింది.