భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడాలి

Update: 2020-06-05 09:29 GMT

భావితరాల ప్రజలు ఆరోగ్యకరంగా జీవించేందుకు ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దేశంలోని కొండలు,నదులు, అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. పర్యావరణం బాగుంటే అసలు ఆస్పత్రుల అవసరమే ఉండదని నిపుణులు చెబుతారని..ఈ దిశగా అందరి అడుగులు పడాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. మానవజాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలం. మానవ మనుగడకు ఆధారం పంచభూతాలు. నింగి, నీరు, నేల, నిప్పు, గాలితో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుందని పేర్కొన్నారు.

జనసేన మూల సిద్ధాంతాలలో పర్యావరణానికి సముచిత స్థానం కల్పించామన్నారు. ఈ ఏడాదిలో పర్యావరణాన్ని పరిరక్షించుకోడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకోవలసిన రోజు ఇది. ప్రస్తుత పరిస్థితులు చక్కబడగానే “మన నది- మన నుడి” కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుకు తీసుకెళతామని తెలిపారు. పర్యావరణానికి హితమైన మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను అమలుచేస్తాము. పర్యావరణాన్ని విషతుల్యం చేసే పరిశ్రమలపై నిరసన గళం వినిపిస్తూనే ఉంటామని తెలిపారు.

Similar News