మంత్రుల అత్యుత్సాహంతో పార్టీకి నష్టం

Update: 2020-06-13 14:34 GMT

కావాలని చేస్తున్నారనే విమర్శలు వస్తాయి

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

‘టీడీపీ నేతలు ఇక రోజుకు ఒకరు అరెస్ట్ అవుతారంటూ మంత్రులు ప్రకటన చేయటం ఏ మాత్రం సరికాదు. ఈ అత్యుత్సాహపు ప్రకటనలు వైసీపీకి లాభం చేయకపోగా నష్టమే చేస్తాయి. ఇలాంటి ప్రకటనలతో కేవలం రాజకీయ కారణాలతోనే అరెస్ట్ లు చేస్తున్నారనే అనుమానాలు వస్తాయి’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ చర్చలో పాల్గొంటూ ఆయన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ తోపాటు పలు అంశాలపై స్పందించారు. గోడ దూకి అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేయాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించారు.

నిజంగా తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని, కాకపోతే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన విధానం సరిగాలేదన్నారు. ఆధారం లేకుండా ఎవరూ కేసులు పెట్టలేరు. కక్ష సాధింపునకే కేసులు పెడుతున్నారనడం సరికాదు. అచ్చెన్నాయుడిని పరామర్శించడానికి చంద్రబాబును అనుమతించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే. పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు జగన్‌ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. జగన్‌ నిర్ణయాలు ప్రతిపక్షానికి నచ్చక కోర్టుల్లో పిల్‌లు వేశారు. రంగుల విషయంలో కోర్టు తీర్పును అమలుచేయాల్సిందే అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. సమస్యల గురించి చెబుదామంటే తనకు కూడా కొన్నిసార్లు సీఎం సమయం దొరకటంలేదన్నారు.

Similar News