తెలంగాణలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు సర్వీసులు ప్రారంభం కాగా..ఏపీలోనూ గురువారం నుంచి బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీలో బస్ ల నిర్వహణకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బస్సులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సిద్ధమైంది. అయితే ఆన్లైన్లో మాత్రమే టికెట్ బుకింగ్కు అవకాశం కల్పించింది. కేవలం సూపర్ లగ్జరీ సర్వీసులకు మాత్రమే కాకుండా ఆర్డినరీ బస్సులకు కూడా ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. బస్సు సర్వీసుల రూట్లపై ఏపీఎస్ ఆర్టీసీ పూర్తి వివరాలను బుధవారం నాడు ప్రకటించే అవకాశం ఉంది.
వైరస్ వ్యాప్తి చెందకుండా సగం సీట్లు మాత్రమే నింపి బస్సు సర్వీసులు నడపడానికి అనుమతివ్వాలని ప్రభుత్వం భావించిన విషయం తెలిసిందే. ప్రైవేటు బస్సులకూ అనుమతులు ఇవ్వాలని, ఒక్కో బస్సులో 20 మందినే అనుమతించాలని సీఎం స్పష్టం చేశారు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించి, ప్రయాణికులందరూ మాస్క్ ధరించే విధంగా విధివిధానాలు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు.