జగన్ కు చంద్రబాబు లేఖ

Update: 2020-03-23 13:42 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి 2నెలలకు సరిపడా నిత్యావసరాలు ఇవ్వాలని, ప్రతి పేద కుటుంబానికి రూ.5వేలు తక్షణ సాయంగా ఇవ్వాలని కోరారు. మార్కెట్‌లో నిత్యావసర ధరలను కట్టడి చేయటానికి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. కరోనాతో ప్రపంచ దేశాలన్నీ తల్లడిల్లుతున్నాయని, కేవలం లాక్‌డౌన్‌తో ఆశించిన ప్రయోజనాలు నెరవేరవని చెప్పారు.

ప్రజారోగ్య చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే విదేశాల నుంచి ఏపీలోకి 15వేల మంది వచ్చారని సమాచారం ఉందని పేర్కొన్నారు. వారందరికీ కట్టుదిట్టంగా క్వారంటైన్‌ అమలు చేయాలన్నారు. కరోనా సోకినవారి కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలని, గ్రామాలు, వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని చంద్రబాబు కోరారు.

 

 

Similar News