జగన్ వల్ల ఏమీ కాదు

Update: 2020-02-22 11:56 GMT

గత ప్రభుత్వ అక్రమాలపై జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏర్పాటు చేసిన ‘సిట్’ఫై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు స్పందించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేసుకోవచ్చునని, దిక్కున్నచోట చెప్పుకోమన్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ ఏర్పాటు చేసిన సిట్‌పై స్పందించిన ఆయన మాట్లాడుతూ జగన్ మాదిరిగా తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. బెదిరింపులకు ఇక్కడ భయపడేవారు లేరని, గత ఏడు నెలలుగా ఇదే మాట చెబుతున్నారని అన్నారు. జగన్ తప్పులు చేసి ఇరుక్కుపోయారని, రాత్రులు నిద్ర లేని పరిస్థితి వస్తుందని, జగన్ వల్ల ఏమీ కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ట్విట్టర్ ద్వారా కూడా చంద్రబాబు సిట్ వ్యవహారంపై స్పందించారు. తనపై, టీడీపీపై ఈ ప్రభుత్వానికి ఎంతో కక్ష ఉందని అన్నారు. ప్రభుత్వం వేసిన సిట్‌ దానికి మరో ఉదాహరణ అని చెప్పారు. 9 నెలల్లో మూడు సిట్‌లు, 5 కమిటీలు వేశారని, 8 నెలల క్రితమే కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశారన్నారు. రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడటం, పెట్టుబడులు తరిమేయడం తప్ప ఏం సాధించారని ప్రశ్నించారు. మీ పాలనపై వచ్చే ప్రభుత్వం సిట్‌ వేస్తుందని, వీటితో ప్రజలకు ఒరిగేది ఏంటని ప్రశ్నించారు. టీడీపీ ఏనాడూ తప్పు చేయలేదని, వైసీపీ బెదిరింపులకు భయపడమన్నారు.

Similar News