అమరావతికి మద్దతుగా జాతీయ రహదారుల దిగ్బంధనానికి తెలుగుదేశం నేతలు పిలుపు ఇవ్వటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం ఉదయం నుంచే టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఎంపీ కేశినేని నానితోపాటు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీ నేతలు బొండా ఉమా తదితర నేతలను గృహ నిర్బందంలో ఉంచారు.
కృష్ణా, గుంటూరు జిల్లా నేతలే టార్గెట్ గా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గుంటూరు జిల్లాలోనూ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, డొక్కా మాణిక్యవరప్రసాద్ లపై ఆంక్షలు విధించారు. టీడీపీ నేతలతోపాటు జెఏసీ నేతలను కూడా పోలీసులు ముందస్తు చర్యల కింద అదుపులోకి తీసుకున్నారు.