చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్యే లేఖ..తీవ్ర విమర్శలు

Update: 2020-01-02 08:45 GMT

‘ నా విషయంలోనే అలా ఎందుకు?.’ అంటూ టీడీపీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి లేఖ రాశారు. నియోజకవర్గ సమస్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళితే కనీసం తననుంచి వివరణ కూడా తీసుకోకుండా తన నియోజకవర్గంలో పార్టీ తరపున ఇన్ ఛార్జిని పెట్టడం వెనక కారణం ఏంటి అని ప్రశ్నించారు. ఇదే తరహాలో మిగిలిన నియోజకవర్గాల్లో ఎందుకు చేయలేదన్నారు. టీడీపీలో ఒక సామాజిక వర్గానికి మాత్రమే పెద్ద పీట వేస్తున్నారని ఆయన ఆరోపించారు. గత నాలుగు రోజులుగా తనకు వ్యతిరేకంగా అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. టీడీపీ ఒక సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిశాను. స్థానిక సమస్యలు వివరించాను. సీఎం వెంటనే స్పందించి రూ. 25 కోట్లు విడుదల చేశారు. ముఖ్యమంత్రి దగ్గరకి ఎందుకు వెళ్లారని ఒక్కమాట కూడా అడగకుండా.. ఇంచార్జ్‌ గా మరో వ్యక్తిని నియమించాల్సిన అవసరం ఏంటి?.

ప్రజల కోసం సీఎం ని కలిస్తే తప్పేంటి? వల్లభనేని వంశీ నియోజకవర్గంలో ఇంతవరకు ఎందుకు నియమించలేదు?. కోడెల శివప్రసాదరావు నియోజకవర్గంలో ఇంచార్జ్‌ ని ఎందుకు నియమించలేదు?. ఒక సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తున్నారు. జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉంటే 9 సీట్లు ఒక సామాజిక వర్గానికే కేటాయించారు. ఎన్‌టీఆర్‌ స్థాపించిన పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. దీనిపై చంద్రబాబు నాయుడు ఆత్మవిమర్శ చేసుకోవాలి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా అట్టిపెట్టుకుని ఉంటే ఇదేనా మీ ప్రవర్తన. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడిన నలుగురు విశాఖ ఎమ్మెల్యేలపై మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. మీ పార్టీలో నాయకులు బయటకు వెళితే వారి ఇళ్ళపైన దాడులు చేస్తారా.? ’అని ప్రశ్నించారు.

 

 

Similar News