కాకినాడలో ఆదివారం నాడు చోటుచేసుకున్న పరిణామాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శనివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు చంద్రబాబు, నారా లోకేష్ లపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో పెద్ద దుమారమే రేగింది. అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు వాళ్లపై రాళ్ళు, కర్రలతో దాడికి దిగారు. పరస్పరం ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు రాళ్లు రువ్వుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులను భారీ ఎత్తున మోహరించారు. ఇష్టానుసారం అభ్యంతరకర భాషలో మాట్లాడిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ అక్కడ నుంచే ఈ ఘటనపై స్పందించారు సభ్య సమాజం ఛీత్కరించుకొనే పదజాలంతో ప్రసంగం చేసిన ప్రజా ప్రతినిధి తీరుపై నిరసన తెలియచేస్తున్న జనసేన కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడటం అత్యంత దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు.
ప్రజలచే ఎన్నుకోబడ్డ ఒక ప్రజా ప్రతినిధి బాధ్యత లేకుండా అసభ్యకరంగా మాట్లాడిన తీరును ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. తప్పుని తప్పు అని చెబుతున్నవారిపై అరాచక శక్తులతో దాడులు చేయిస్తే జన సైనికులు వెనకడుగు వేస్తారనుకోవద్దు. అధర్మాన్ని ఖండించడమే జనసేన విధానం. రెచ్చగొట్టే రీతిలో వ్యవహరిస్తున్న ఆ ప్రజా ప్రతినిధిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లా పోలీసు యంత్రాంగాన్ని కోరేది ఒకటే పక్షపాతం లేకుండా ఇరు వర్గాలతో చర్చించి శాంతియుత పరిస్థితులు తీసుకురావాలి. జనసేన కార్యకర్తలకు, నాయకులకు అన్యాయం చేసి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తే ఢిల్లీ పర్యటన నుంచి నేరుగా కాకినాడకు వచ్చి వారికి బాసటగా ఉంటాను. రాళ్ళ దాడిలో గాయపడిన జన సైనికులు, నాయకులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రతి జన సైనికుడు వారికి ధైర్యాన్ని అందించి అండగా నిలవాలి’ అని సూచించారు.