జగన్ సర్కారుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

Update: 2019-10-01 08:57 GMT

మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చి పలు అంశాలను ప్రస్తావించారు. విద్యుత్ కోతలు జగన్ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చాయన్నారు. విద్యుత్ కోతలకు కారణం బొగ్గు అనో..లేక గత ప్రభుత్వం అనో చెపితే ప్రజలు అంగీకరించరని అన్నారు. తమకు విద్యుత్ వస్తుందా? లేదా అన్నదే ప్రజలు చూస్తారు తప్ప..ప్రభుత్వ వివరణలు కాదన్నారు. 151 సీట్లు, 51 శాతం ఓట్లు శాశ్వతమని జగన్‌ అనుకోవద్దని సూచించారు. 1972లో 51 శాతం ఓట్లు, 220 సీట్లు సాధించిన పీవీ నరసిహారావును 9 నెలలకే దింపేశారు. 1994లో 54 శాతం ఓట్లు, 223 సీట్లు సాధించిన ఎన్టీఆర్‌నూ అదే 9 నెలలకు దింపేశారు. అసలు ఎన్టీఆర్ ను చంద్రబాబు పదవిలో నుంచి దింపేస్తారని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు.

ప్రజలనే కాదు..తమతో పాటు గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలను జగన్‌ సంతృప్తి పరచాలి. సీఎం తమ మాట వింటున్నారని..తమకు గౌరవం ఇస్తున్నారని ఎమ్మెల్యేలు భావించేలా జగన్ చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. నవరత్నాల్లో ఒకటి తేడా వచ్చినా జగన్‌ మనుషులే తిరగడబడతారు. ఎన్టీఆర్‌ గెలిపించుకున్న ఎమ్మెల్యేలే ఆయనపై తిరుగుబాటు చేశారు. ఇన్ని సీట్లు..ఇంత ఓట్ల శాతం సాధించటం జగన్ స్వయంకృషే అని అందులో అనుమానం ఏమీలేదన్నారు. అయితే ఎప్పుడూ ఇదే పరిస్థితి ఉంటుందని అనుకోవటం పొరపాటు అవుతుందన్నారు. అయితే నాయకుడు అనే వాడు గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

 

 

 

 

 

Similar News