ఎయిర్ ఇండియా జాతిపిత మహాత్మాగాంధీకి వినూత్నంగా నివాళి ఇచ్చింది. బుధవారం నాడు మహాత్మ గాంధీ 150వ జయంతి అన్న సంగతి తెలిసిందే. గాంధీకి వినూత్న నివాళిగా ఎయిర్బస్ ఏ 320పై జాతిపిత చిత్రాన్ని ముద్రించింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా హ్యాంగర్ వద్ద విమానం టెయిల్పై మహాత్ముని చిత్రాన్ని ముద్రించారు. మొత్తం పెయింటింగ్ను సంస్థలో పనిచేసే ఉద్యోగులే ముందస్తు అనుమతితో తీర్చిదిద్దారు.
ఒక విమానంపై మహాత్మ గాంధీ బొమ్మను శాశ్వత ప్రాతిపదికన పెయింట్ చేయడం ద్వారా జాతిపిత 150వ జయంతోత్సవాలను తమ సంస్థ ఘనంగా నిర్వహించిందని ఎయిర్ ఇండియా ప్రతినిధి ధనంజయ్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు భారతీయ రైల్వేలు సైతం సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలో డీజిల్ రైళ్లపై మహాత్ముని చిత్రం పెయింట్ చేయడం ద్వారా జాతిపిత 150వ జయంతిని వినూత్నంగా నిర్వహించింది.