మైహోం సంస్థలపై ఐటి దాడులు!

Update: 2019-07-04 13:10 GMT

మైహోం రామేశ్వరరావుకు చెందిన సంస్థలు, నివాసాల్లో గురువారం ఉదయం నుంచి ఐటి దాడులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం కార్పొరేట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. తాజాగా మై హోం రామేశ్వరరావు వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు. టీవీ9 యాజమాన్యాన్ని కొద్ది రోజుల క్రితమే మై హోం గ్రూప్..ఇతర సంస్థలతో కలసి అలందా మీడియా పేరుతో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మైహోం రామేశ్వరరావు వార్తల్లో నిలుస్తున్నారు. మై హోం గ్రూపునకు చెందిన అన్ని కార్యాలయాలు, నివాసాల్లో ఐటి దాడులు జరగటం ఆసక్తికర పరిణామంగా మారింది. గత కొంత కాలంగా మై హోం గ్రూప్ మీడియాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది.

ఈ తరుణంలో ఐటి రంగంలోకి దిగటం ఆసక్తికర పరిణామంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు మై హోం రామేశ్వరరావు అత్యంత సన్నిహితుడు అన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల తర్వాత హైదరాబాద్ లో ఇంత భారీ ఎత్తున ఐటి దాడులు జరగటం ఇదే మొదటిసారి కావటం విశేషం. అయితే ఈ ఐటి దాడుల్లో ఏమి స్వాధీనం చేసుకున్నారనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.

 

Similar News