ఎన్నికలకు ముందు వైసీపీని వీడి నష్టపోయిన వారిలో ఎవరైనా ఉన్నారా? అంటే అందులో మొదటి జాబితాలో వంగవీటి రాధాకృష్ణ ఒకరు. ఆయన టీడీపీలో చేరటంతో పాటు..ఏకంగా రంగా హత్యలో టీడీపీ నేతల పాత్రేమీ లేదని వ్యాఖ్యానించటం ద్వారా తన సొంత సామాజిక వర్గంలోనే తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చినా ఆ పార్టీకి ఇప్పుడున్న మెజారిటీ ప్రకారం ఒక్కటంటే ఒక్క సీటు కూడా వచ్చే ఛాన్స్ లు లేవు.
టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించిన వంగవీటి రాధా పార్టీ మారి రాజకీయంగా బాగా నష్టపోయినట్లు అయింది. ఆయన సోమవారం నాడు అమరావతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశం అయ్యారు. దీంతో ఆయన జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో జనసేన కూడా దారుణ ఓటమిని చవిచూసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీచేసిన రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమిని చవిచూశారు. కేవలం రాజోలు సీటు ఒక్కటే జనసేన దక్కించుకోగలిగింది.