తెలంగాణ నూతన ముఖ్యమంత్రి కెసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ టర్మ్ లో ఎవరినీ వదిలిపెట్టేదిలేదన్నారు. ఓటుకు నోటు కేసు కూడా ప్రాసెస్ లో ఉందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత కెసీఆర్ మీడియాతో మాట్లాడారు. గురువారం నాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపారు. తాను తప్పకుండా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తానని వెల్లడించారు. కెసీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే....రాష్ట్రాలపై కేంద్రం అనవసర పెత్తనం విషయంలో రాష్ట్రాలు ఆలోచించాలి, ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ రెండూ రెండే. దేశానికి ఒక కొత్త ఆర్ధిక, వ్యవసాయ విధానం అవసరం. ఇజ్రాయెల్ దేశం వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉంది.
దేశంలో వ్యవసాయ విధానాల్లో మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ ఇచ్చే హామీలు క్రైమ్. సీపీఎస్ ని తెచ్చిందే కాంగ్రెస్.పచ్చి అవకాశ రాజకీయాలు చేసే బీజేపీ, కాంగ్రెస్ లను ఖతం చేయాల్సిన అవసరం ఉంది. దేశంలోనే 100 కు 100% మేనిఫెస్టో ను అమలు చేసిన పార్టీ టీఆర్ఎస్. ఇంటికి ఒక ఉద్యోగం అని నేనెప్పుడూ చెప్పలేదు. "రైతుబంధు", "రైతు బీమా" స్కీమ్స్ అనేది మేము మేనిఫెస్టోలో ఏమీ చెప్పలేదు... సందర్భాన్ని బట్టి ఇలాంటి పథకాలను తీసుకొచ్చాం. గోదాముల సామర్ధ్యాన్ని పెంచాం. మా పనితీరు, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు మాకు 88 స్థానాల్లో విజయం కట్టబెట్టారు. కంటి వెలుగు కార్యక్రమంలో ఎంతోమంది పరీక్షలు చేయించుకున్నారు.అమ్మ ఒడి కి మంచి పేరు వచ్చింది. "కళ్యాణ లక్ష్మి" పథకం ప్రవేశ పెట్టక బాల్య వివాహాలు ఆగిపోయాయి. ఏపీ కి ఖచ్చితంగా వెళ్తా. కోర్టు ఆదేశాల ప్రకారం రాబోయే వారం రోజుల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ పై చర్యలు తీసుకుంటాం. కేబినెట్ కూర్పు లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఉంటుంది. నా "ఫెడరల్ ఫ్రంట్" ద్వారా "రైతుబంధు" పథకాన్ని దేశం మొత్తం అమలు చేస్తాం. ఇందుకోసం మూడున్నర లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. నా దగ్గర ఎజెండా... లెక్కలు ఉన్నాయి. ఈ ఆర్ధిక సంవత్సరం లో 29.90% గ్రోత్ రేట్ ఉంది.
ఇండియాలో మరే రాష్ట్రంలో కూడా ఇందులో సగం లేదు. రూ. 70 వేల కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో మాకు సీట్లు రాకపోయినా... అక్కడ దుమ్ముగూడెం ద్వారా వచ్చే జులై లో నీళ్ళు అందిస్తాం. వచ్చే 18 నెలల్లో కాళేశ్వరం, సీతారామ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల ను పూర్తి చేస్తాం. రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ఆర్ ఈసీ సంసిద్ధతను వ్యక్తం చేసింది. భారీ మెజారిటీ తో గెలిచినందుకు మన రాష్ట్ర పరపతి పెరిగింది. మాకన్నా ముందు పాలించిన కాంగ్రెస్, టీడీపీ లు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి? విపక్షాలు పచ్చి అబద్దాలు చెప్పి యూత్ ను ఇబ్బంది పెడుతున్నాయి. అనవసరంగా నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు. ప్రపంచవ్యాప్తంగా చూసినా.... ప్రభుత్వ ఉద్యోగాల శాతం 1% కంటే తక్కువే. కేంద్ర ప్రభుత్వాల ఫ్యూడల్ పద్ధతి నశించాలి... అప్పుడే దేశంలో గుణాత్మక మార్పు వస్తుంది. నాకు ధైర్యం ఉంది... నేను అలాంటి మార్పును తీసుకొస్తా. ఏపీ కి ప్రత్యేక హోదా వల్ల వచ్చేది ఏంది సచ్చేది ఏంది అని అక్కడి సీఎం చంద్రబాబే అన్నారు... ఆయనకే క్లారిటీ లేదు... ఇక నేనేం చెప్పాలి? మా మేనిఫెస్టో ను 100% అమలు చేస్తాం. నిరుద్యోగ భృతి వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ప్రారంభం అవుతుందని తెలిపారు.